2013 లో డల్లాస్ లో జరిగిన తానా మహా సభలో నాటి తానా అధ్యక్షులు తోటకూర ప్రసాద్, కన్వీనర్ వెన్నం మురళి మరియు ఇతర కార్య నిర్వాహక సభ్యుల సారధ్యంలో నాటి కేంద్ర మంత్రి చిరంజీవి స్వరనిధి కరపత్రం ఆవిష్కరించగా తొలి ప్రతిని ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం అందుకున్నారు. కవి గేయ రచయిత జొన్నవిత్తుల, భాషా సాంస్కృతిక మండలి అధ్యక్షులు మండలి బుద్ధప్రసాద్ మరియు మంత్రి గంటా శ్రీనివాసరావులు శుభాశీస్సులు అందించారు.ఆదినుంచి అన్నింటా అండగా ఉండే తనికెళ్ళ భరణి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు .ఆయనే ఈ కరపత్రానికి రూపశిల్పి కూడా. ఇంతటి స్వరనిధి గొప్ప తనాన్ని తొలిగా గుర్తించిన ఘనత తానాకే దక్కింది.
మద్రాస్ సంగీత అకాడమీ వారి ఆహ్వానము మేరకు డిసెంబరు 24,2014 నాడు స్వర వీణాపాణి తన అపూర్వ స్వర కల్పనను విశిష్టఅతిధుల సమక్షంలో ఆనందాతిరేకాల మధ్య ప్రదర్శించారు. వారిలో సంగీతజ్ఞులు, విఖ్యాత గాయినీ గాయకులు, వాద్యకారులు మరియు సంగీత రసజ్ఞులు ఎందరోవున్నారు . ప్రఖ్యాతులైన హైదరాబాదు సోదరులు ఈ కార్యక్రమానికి తమ మధుర గాత్రంతో సహకరించడమే కాక స్వరనిది సాధించే వివిధ అంశాలను విపులీకరించారు. ఈ సభకు డాక్టర్ పప్పు వేణుగోపాలరావు అధ్యక్షత వహించారు. స్వర వీణాపాణి తన ఏకలవ్య శిష్యుడని సభకు పరిచయంచేస్తూ ఈ ప్రయోగాన్ని ఒక అనితర సాధ్యమైన కల్పనగా అభివర్ణిస్తూ సంగీత కళానిధి పద్మభూషణ్ టి.వి.గోపాలక్రిష్ణన్ ఈ సృజన సంగీత విద్యార్ధినీ విద్యార్ధులకు ఎంతగానో ఉపయుక్తమవుతుందని ప్రకటించారు.
తన స్పందనను తెలియజేస్తూ వీణాపాణి ఇందులో తన పాత్ర ఒక మాధ్యమ౦ మాత్రమేనని సజీవ భారతీయ సంగీతాన్ని భావి తరాలవారికి అందజేయాలనుకుంటున్నట్లు చెప్పారు.